*విశాఖపట్నం* : విశాఖపట్నం: అల్లారుముద్దుగా పెంచుకున్న తనయుడు తన కళ్లముందే చనిపోవడం ఆ తండ్రిని కలచివేసింది.
చిన్నప్పుడు తన గుండెలపై పడుకున్న కొడుకు ఇప్పుడు చనిపోయి చితిపై పడివుండటాన్ని చూసి ఆ తండ్రి తట్టుకోలేకపోయాడు.
దీంతో కొడుకు అంత్యక్రియలను నిర్వహిస్తూ ఆ తండ్రి గుండె ఒక్కసారిగా ఆగిపోయింది. ఈ విషాద ఘటన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నం జిల్లాలో చోటుచేసుకుంది.
యారాడకు చెందిన బాయిన అప్పారావు ఉద్యోగం, పిల్లల చదువుల కోసం విశాఖపట్నంలోని మల్కాపురంలో నివాసముంటున్నారు. ఇతడికి ఇద్దరు అమ్మాయిలు, ఓ అబ్బాయి సంతాపం. పెద్దమ్మాయి పెళ్లయిపోగా ఇంకో కూతురు చదువుకుంటోంది. కొడుకు గిరీష్(22) ఏవియేషన్ కోర్సు చేసాడు.
ఇలా అప్పారావు కుటుంబం ఏ చీకూచింతా లేకుండా హాయిగా జీవితం సాగుతోంది. అయితే రోజులన్నీ ఒకేలా వుండవు కదా... ఇన్నిరోజులు ఆనందంగా ఈ కుటుంబంలో ఒక్కసారిగా చీకట్లు కమ్ముకున్నారు.
ఏవియేషన్ కోర్సు చేసిన గిరీష్ ఉద్యోగాన్వేషనలో వుండగా ఒక్కసారిగా అనారోగ్యం పాలయ్యాడు. దీంతో అతడిని కుటుంబసభ్యులు ఓ ప్రైవేట్ హాస్పిటల్ కు తరలించి చికిత్స అందించారు. అయినా ఫలితంలేకుండా పోయింది. చికిత్స పొందుతూ అతడు మృతిచెందాడు.
కొడుకు మృతి ఆ తల్లిదండ్రులకు తీవ్ర దు:ఖాన్ని కలిగించింది. తమకు తలకొరివి పెట్టి పున్నామనరకం నుండి కాపాడతాడని భావించిన కన్న కొడుకుకే తలకొరివి పెట్టాల్సి రావడంతో ఆ తండ్రి గుండె తట్టుకోలేకపోయింది.
ఈ క్రమంలోనే కొడుకు గిరీష్ మృతదేహాన్ని చితిపై పడుకోబెట్టి చూట్టూ తిరుగుతుండగా ఒక్కసారిగా గుండెపోటుకు గురయిన తండ్రి అప్పారావు స్మశానంలోనే కుప్పకూలిపోయాడు. ఇలా కొడుకు అంత్యక్రియలు నిర్వహిస్తూ తండ్రి కూడా మరణించాడు.
ఒకేసారి కొడుకును, భర్తను కోల్పోయిన ఆ తల్లి బోరున విలపిస్తున్న తీరు అక్కడున్న అందరినీ కన్నీరు పెట్టించింది. సోదరుడితో పాటే తండ్రి కూడా మృతిచెందడంతో ఇద్దరమ్మాయిలు కంటతడి పెడుతుంటే ఓదార్చడం ఎవరితరం కాలేదు. ఇలా తండ్రీకొడుకులు ఒకేసారి చనిపోవడం మల్కాపురంలో విషాదాన్ని నింపింది.